మిషన్ భగీరథ పై సీబీఐ విచారణ జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్రమంత్రి గజేంద్ర షేకావత్ తెలంగాణలో మిషన్ భగీరథ బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని గతంలో ఆరోపించారని తెలిపారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాగునీటి పథకాలు మూసివేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిధుల కొరత పేరుతో రూ.3 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. స్కామ్ ల కోసమే స్కీమ్ లు రూపొందిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదని, పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు.