తెలంగాణ సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వర్సిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పేద విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని, ఇప్పుడవి లేకపోతే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతవిద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ ఉస్మానియా వర్సిటీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు.