telugu navyamedia
సినిమా వార్తలు

ఈ మాత్రానికే భానుమతి భయపడుతుందా?: భగీరథ

శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి 95వ జయంతి సందర్భంగా ఆమె వ్యక్తిత్వం, అంకితభావం ఎలాంటిదో తెలియజెప్పే 56 సంవత్సరాల క్రితం జరిగిన అరుదైన సంఘటన: “నవ్య” పాఠకుల కోసం. హీరో కావాలని సినిమా రంగంలోకి ప్రవేశించిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ అవకాశాలు రావని తెలుసుకొని నిర్మాతగా మారాడు. తన తండ్రి గారి పేరుతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను ప్రారంభించి “అన్నపూర్ణ” అనే సినిమాను రూపొందించారు. తరువాత “ఆరాధన”, “ఆత్మబలం” చిత్రాలను నిర్మించారు. అయితే “ఆత్మబలం” సినిమా ఆర్ధికంగా దెబ్బతీసింది. అందుకే కథ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకొని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా నాగేశ్వరరావును హీరోగా, దర్శకుడిగా వి .మధుసూదనరావును ఖరారు చేశారు. హీరోయిన్‌గా కృష్ణకుమారిని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో సోదరి పాత్రకు జమున అయితే బాగుంటుందని అనుకున్నారు. జమున “అన్నపూర్ణ” చిత్రంలో కథానాయిక. ఆమెకు అడ్వాన్సు కూడా ఇచ్చారు.

ఒక వారం రోజుల తరువాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి “నేను ఆ పాత్ర చేయలేను, నాగేశ్వరరావు గారి చెల్లెలి పాత్ర చేస్తే, అలాంటి సినిమాలే వస్తాయని అందరూ అంటున్నారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. మీరు మరోలా భావించకండి అడ్వాన్స్ పంపిస్తాను” అని చెప్పారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, మధుసూదనరావు గారు బాగా ఆలోచించి ఆ పాత్రకు భానుమతి గారు బాగుంటారని అనుకున్నారు. తరువాత రోజు రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతిని గారిని కలసి ఆ పాత్ర గురించి చెప్పారు. ఆమె ఒప్పుకున్నారు. వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 1965వ సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలయ్యింది. ఎక్కువ భాగం శ్రీ సారధి స్టూడియోస్ లో జరపడానికి నిర్ణయించారు.

సారథి స్టూడియోస్ పరిపాలన భవనం మీద ఆరు గదులు ఉండేవి. అందులో నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ ఉండేవారు. అప్పటికే భానుమతి గారు పెద్ద హీరోయిన్. అందుకే ఆమెకు హైదరాబాద్‌లోని పెద్ద హోటల్లో రూమ్ బుక్ చెయ్యాలని రాజేంద్ర ప్రసాద్ని ర్ణయించుకున్నారు. ఈ విషయం భానుమతి గారితో చెబితే “ఎందుకు ప్రసాద్ గారు డబ్బు దండుగ, నేను కూడా మీతో పాటే సారథి స్టూడియోస్ లోనే వుంటాను” అని చెప్పారు. సారథి స్టూడియోస్ లో షూటింగ్ మొదలయ్యింది. రెండు షెడ్యూళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా జరిగిపోయాయి. మూడవ షెడ్యూలు కోసం సారథి స్టూడియోస్ లోనే ఓ సెట్ వేశారు. ఇందులో భానుమతి, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, రమణారెడ్డి, జూనియర్ ఆర్టిస్టుల మీద ఓ పాటను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

మద్రాస్ నుంచి భానుమతి హైదరాబాద్ వచ్చి సారథి స్టూడియోస్ లోని గదిలో వున్నారు. నిర్మాత రాజేంద్రప్రసాద్, దర్శకుడు మధుసూదనరావు ఇద్దరూ ప్రొడక్షన్ ఆఫీస్ లో వున్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే 6 గంటలకు ప్రొడక్షన్ మేనేజరు స్టూడియో నుంచి ఫోన్ చేసి” సార్ కొంప మునిగింది, రాత్రి భానుమతి గారి కాలి గోళ్లను ఎలుకలు కొరికేశాయి” అని చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆగమేఘాలమీద సారథి స్టూడియోస్‌కి వచ్చారు. అప్పటికే భానుమతి గారు కాలి గోళ్ళ దగ్గర డెట్టాల్ రాసుకుంటూ కనిపించారు. “అయ్యో ఎంత పని జరిగింది, షూటింగ్ క్యాన్సిల్ చేద్దాము, డాక్టర్‌కు కబురు చేస్తాను” అని రాజేంద్ర ప్రసాద్ కంగారుగా అన్నాడు.

భానుమతి రాజేంద్ర ప్రసాద్ వంక చూసి ” ఈ మాత్రం దానికే డాక్టర్ అవసరం లేదు, షూటింగ్ క్యాన్సిల్ చేసే అవసరమే లేదు. మీరు నిశ్చింతగా ఏర్పాట్లు చేసుకోండి” అని చెప్పారు. భానుమతి మాటలతో రాజేంద్ర ప్రసాద్ గారు సంతృప్తి పడలేదు. ఇంకేదో చెప్పబోతున్నారు. “ప్రసాద్ గారు ఇంత చిన్న విషయానికే భయపడితే నేను భానుమతిని ఎట్లా అవుతాను ? ప్రసాద్ గారు పాట విన్నాను. చాలా బాగుంది. దులిపేస్తా అంతే, మీరు వెళ్ళండి” అని చెప్పారు నవ్వుతూ. ఆ సినిమా పేరు “అంతస్తులు” ఆపాట “దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా”. దీనిని కొసరాజు రాఘవయ్య చౌదరి రాశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్. దర్శకుడు వి.మధుసూదన రావు. అంతస్తులు సినిమా 27 మే 1965లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ పాట జనానికి అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉర్రుతలూగిస్తుంది.

Related posts