telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ 2020 : యూఏఈ ఆతిథ్యం… బీసీసీఐ అధికారిక ప్రకటన

IPL

ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా జరగడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరిగేలా ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్‌ని తయారు చేసిన బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకి కూడా ఈ మేరకు సమాచారమిచ్చి నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలని సూచించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌కి తాము ఆతిథ్యమిస్తామని రెండు నెలల క్రితమే యూఏఈ‌కి చెందిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రతిపాదనని బీసీసీఐకి పంపింది. కానీ.. సెప్టెంబరు నాటికి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆశించిన బీసీసీఐ అప్పట్లో మౌనంగా ఉండిపోయింది. అయితే.. దేశంలో ఇప్పటికీ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోగా.. మరింతగా చేయి దాటిపోయాయి. దాంతో.. భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసిన బీసీసీఐ… తాజాగా ఈసీబీ ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ లేఖని కూడా ఈసీబీకి పంపినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తాజాగా స్పష్టం చేశాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ.. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్‌ల్ని బీసీసీఐ నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఆ అనుభవంతోనే ఈసీబీకి మరో అవకాశం బీసీసీఐ ఇచ్చింది.

Related posts