telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

టీమిండియా ఐసోలేషన్ క్యాంప్‌ కోసం బీసీసీఐ కసరత్తు

Teamindia

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో మార్చి నెల రెండో వారం నుంచే భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం కొంచెం సడలించడంతో మళ్లీ భారత క్రికెటర్లు స్టేడియంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రెండు నెలలకి పైగా మ్యాచ్‌లకి ఆటగాళ్లు దూరంగా ఉండటంతో కనీసం రెండు వారాలు వారికి ప్రాక్టీస్ అవసరమని కోచ్‌లు సూచిస్తున్నారు. సాధారణంగా ఏదైనా సిరీస్‌కి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లకి క్యాంప్‌ని నిర్వహిస్తుంటారు. కానీ.. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించినా.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రయాణ ఆంక్షలు సడలించకపోవడంతో ఆటగాళ్లు ఒక్కచోట క్యాంప్‌కి హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు. అయినప్పటికీ.. అందుబాటులో ఉన్న స్టేడియాల్లో జూన్ మూడో వారం నుంచి టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలెట్టబోతున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వెల్లడించాడు. ఈ మేరకు దేశంలోని రాష్ట్ర క్రికెట్ సంఘాలతో ఇప్పటికే చర్చలు జరిపిన బీసీసీఐ… ఈ నెల చివర్లో ఐసోలేషన్ క్యాంప్‌ విషయంలోనూ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని యోచిస్తోంది. అదే జరిగితే అక్టోబరు-నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ ఆశిస్తోంది.

Related posts