కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ రింకూసింగ్ మూడు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా అబుదాబిలో జరిగిన టీ20 లీగ్లో పాల్గొన్నాడని, బీసీసీఐ నియమ నిబంధనలు పాటించని కారణంగా వెంటనే అతడిపై చర్యలు అమలవుతాయని పేర్కొంది. దీంతో అతడు ఇండియా-ఎ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ 1 నుంచి ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని బీసీసీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా సీనియర్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ అనుమతి లేకుండానే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోగా అతడికి హెచ్చరికలు చేసి వదిలేసింది.
ఈ నేపథ్యంలోనే ఇండియా అండర్-19 మాజీ కెప్టెన్ అనుజ్ రావత్ సైతం బీసీసీఐ అనుమతి లేకుండా మారిషస్లో పాకిస్థాన్ ఆటగాళ్లతో కలిసి టీ20లీగ్ ఆడాడు. పఠాన్లాగే ఇతడిని కూడా బీసీసీఐ అధికారులు హెచ్చరించి వదిలేశారు. కాగా రెండేళ్ల నుంచి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రింకూసింగ్ ఇటీవల ఐపీఎల్ పూర్తయ్యాక అబుదాబిలో వేరే లీగ్ ఆడాడు. అయితే అన్ని నియమాలు తెలిసిన అంతర్జాతీయ ఆటగాడు ఇర్ఫాన్పఠాన్, అనుజ్ రావత్ను హెచ్చరించి వదిలేసి రింకూసింగ్పై ఎందుకు వేటేశారని మరో సీనియర్ అధికారి ప్రశ్నించారు.
బీసీసీఐ దీనిపై స్పందించి, క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సబా కరీం ‘యువ ఆటగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే గట్టి సందేశం ఇవ్వాలనే ఇలా చేశాం’ అని సమర్థించుకున్నాడు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని అధికారి మాట్లాడుతూ.. ‘యువ ఆటగాళ్లకి గట్టి సందేశం ఇవ్వాలనే విషయమే ప్రాతిపదికగా తీసుకుంటే పాకిస్థాన్ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన అనుజ్ రావత్.. ఆపై టీమిండియా అండర్-19 జట్టులో శ్రీలంక పర్యటనలో ఎలా ఆడాడని నిలదీశారు. రింకూసింగ్ కూడా ఇదే నేరానికి పాల్పడినా ఇండియా-ఎ తరఫున ఆడే అవకాశం కోల్పోయాడు.
రామ్ చరణ్ తో పెళ్లి తరవాత ట్రోల్స్ ఎక్కువయ్యాయి : ఉపాసన