దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు యూనియన్లు సమ్మెను రద్దు చేసుకున్నాయి. ముంబైలో ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల్లో సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయని, దీంతో సమ్మెకు దిగరాదని నిర్ణయించుకున్నామని ఏఐబీఈఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమ్మెను బ్యాంకింగ్ సెక్టార్ లోని యూనియన్ల బాడీ యూఎఫ్బీయూ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
బ్యాంకు యూనియన్లతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలు జరిపిందని తెలిపింది. 15 శాతం వరకూ వేతనాలు పెంచేందుకు, ఐదు రోజుల పనిదినాలను అమలు చేసే విషయంలోనూ చర్చలు జరిగాయని ఏఐబీఈఏ పేర్కొంది. యూనియన్లు లేవనెత్తిన ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించింది.