telugu navyamedia
తెలంగాణ వార్తలు

గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం ..

గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరి గుట్ట నుంచి ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో మాట్లాడారు.

బీజేపీ గెలిచిన వెంటనే ఎవరు సీఎం అయినా.. తొలి దర్శనం భాగ్యలక్ష్మి అమ్మవారినే చేసుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఉగ్రనరసింహస్వామి అవతారం ఎత్తి.. టీఆర్ఎస్ రాక్షస పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.

ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు బండి. నల్గొండలో బీజేపీ ఎక్కడ ఉందని చాలా మంది మాట్లాడారని, ఖమ్మం జిల్లాలోనూ బీజేపీ బలం ఏంటో చూపిస్తామని అన్నారు. యాదాద్రి పేరుతో టీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.

నల్గొండ గడ్డపై పుట్టిన శ్రీకాంతాచారి ఎవరి కోసం బలయ్యాడని ఆయన ప్రశ్నించారు. పిడికెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 15 సీట్లే గెలుస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయకత్వం నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు

Related posts