తెలంగాణ ఆర్టీసీ ని ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు చూస్తుందని..ఆ కుట్ర లో భాగమే ఆర్టీసీ ఛార్జ్ల పెంపు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
శుక్రవారం ఆయన జేబీఎస్ బస్టాండులో ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎందుకు నన్ను హౌస్ అరెస్ట్ చేశారో అర్థం కాలేదన్నారు.
బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను సీఎం కేసీఆర్ ఆయన అనుచరులకు దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు 60 శాతం పెంచిన ఘనత కేసీఆర్దే అని అన్నారు.
పేదలకు ఆర్టీసీ బస్సులకే దిక్కని, పేదలపై భారం పడుతోందన్న కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుందని ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని లేదంటే ఆందోళన చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు..