తెలంగాణపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ రాద్దాంతం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ని విమర్శిస్తే టీఆర్ఎస్కి ఏం నొస్తుంది ..ఎక్కడ నొస్తుందో అర్థం కావడం లేదని బండి సంజయ్ అన్నారు.
దిల్లీలో బీజేపీ నేతలతో కలిసి ఆయన తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై పార్లమెంట్ లో ఓటింగ్ జరిగే సమయంలో కేసీఆర్ ఎక్కడున్నాడని బండి ప్రశ్నించారు.
తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా చెప్పినా… ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు తెరాస యత్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మోదీ విభజనను తప్పు పట్టడం లేదని.. కేవలం విభజన జరిగిన తీరునే ఆయన ప్రశ్నించారన్నారు.
బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎక్కడా పెప్పర్ స్ప్రే కొట్టలేదని.. కానీ ఏపీ విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు పెప్పర్ స్ప్రే కొట్టినా సుష్మాజీ భయపడలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు.
తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పుడు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? తెలంగాణ వద్దన్న ద్రోహులనే ఇవాళ కేసీఆర్ చేరదీశారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ఏమైనా చేసిందా? అని బండి ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం రాజ్యమేలడానికా తెలంగాణ వచ్చింది అని నిలదీశారు.
కృష్ణా జిల్లాలో 279 టీఎంసీల కోసం సంతకం కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టాడని బండి సంజయ్ నిలదీశారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా, బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.
మంగ్లవారం పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారంటూ ఆరోపించారు మోదీ. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని మోదీ మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు ప్రధాని మోదీ.