తెలంగాణ లో అసెంబ్లీ రద్దు చర్చపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఈడీ , సీబీఐ కేసులు, ప్రజల్లో వ్యతిరేకతతో భయపడి అసెంబ్లీ రద్దు చేయాలన్న చర్చ మొదలు పెట్టినట్లు చెప్పారు.
మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ..కొడుకు, కూతురు చేసిన అవినీతి అక్రమాస్తుల సంపాదన చూసి కేసీఆరే ఆశ్చర్యపోతున్నారని ఆరోపించారు.
మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్కు పట్టుకుందని విమర్శించారు.దీంతో సీఎం బాగా డిప్రెషన్లోకి వెళ్లారంటూ బండి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి.. మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
అందుకే అసెంబ్లీని రద్దు చేసే ప్రజల్ని మరోసారి హామీలతో మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో24 గంటలు సరిగా కరెంట్ ఇవ్వలేని కేసీఆర్ దేశ వ్యాప్తంగా ఎలా ఇస్తాడో చెప్పాలని సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోడానికి ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని నలుగురు మహిళలు చనిపోయారు..
దేశంలో ఎక్కడా జరగని సంఘటన ఇది అని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్లని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంట లోపల 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.
అక్కడ కనీసం మహిళా డాక్టర్ను పెట్టకుండా శస్త్ర చికిత్సలు చేయటం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనకు ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలన్నారు