టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలోనే టీడీపీ నుంచి మరికొందరు నేతలు వైసీపీలోకి వస్తారని తెలిపారు. టీడీపీలో ఉన్న ఇబ్బందులను తమతో చెబుతున్నారని వివరించారు. అయితే, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు వస్తేనే వైసీపీలోకి తీసుకుంటామని బాలినేని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా జిల్లాలతో పోల్చితే ప్రకాశం జిల్లాలోనే అధికంగా టీడీపీ నేతలు వైసీపీ బాటపడుతున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వంటి వారు ఇప్పటికే టీడీపీకి దూరమయ్యారు. మరో ముఖ్యనేత కరణం బలరాం అధికారికంగా వైసీపీలో చేరకపోయినా సీఎం జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.