కార్తీక మాసోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి జగన్మోహిని అలంకారం గావించారు. తెల్లవారు జామున 4.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తదుపరి పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అంతరాలయంలో ఉత్సవ మూర్తులకు (స్వర్ణమూర్తులు) అభిషేకం చేశారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు స్వామివారికి స్వర్ణ తులసి పుష్పార్చన నిర్వహించారు.
మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జగన్మోహినిగా రామయ్యస్వామిని అలంకరించారు. భక్తరామదాసు చేయించిన దివ్యాభరణాలను, ఇతరత్రా భక్తులు సమర్పించిన ఆభరణాలను స్వామివారికి అలంకరింపజేశారు. సాయంత్రం 6 గంటలకు దర్భార్సేవ అనంతరం స్వామివారికి 108 లీటర్ల క్షీరం, 25 రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు.