హాస్యనటుడు బాబు మోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. హాస్యనటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన సినిమాలకు దూరమైపోయారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు టీవీలో, పేపర్లో కనిపించేవారు. అయితే, గత కొన్నేళ్లుగా ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు, ఆయన ఒక పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కరోనా వేళ బయటికి వెళ్లొద్దంటూ ప్రజలకు సూచిస్తూ ఈ పాటను చేశారు. ఈ పాటలో బాబు మోహన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆయన ఇంట్లోనే ఈ పాటను షూట్ చేశారు. ‘సోమలింగా.. ఓరి రామలింగా..’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. బాబు మోహన్ ఈజ్ బ్యాక్ అనిపించేలానే ఉంది. పాటలో సాహిత్యం కూడా గమ్మత్తుగా ఉంది. ఈ పాటను బాబు మోహన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘‘ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి మనమంతా రక్షించబడాలి, దాని బారి నుంచి మనం బయటపడాలి. దీనిపై అన్ని రకాలుగా అవగాహన కలిగించుకుని పొరుగువారిని కూడా మనం కాపాడాలి. ఆ బాధ్యత మనందరిది. అదే విషయాన్ని మన ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, నాయకులు మనందరికీ తెలియజేస్తున్నారు. మీరు గమనిస్తూనే ఉన్నారు. నేను కూడా ఈ వీడియో సాంగ్ ద్వారా మీకు అవగాహన కల్పించడం కోసం చిన్న ప్రయత్నం చేశాను’’ అని మరో వీడియోలో బాబు మోహన్ వెల్లడించారు. ఈ పాటను మహవీర్ యెలెందర్ స్వరపరిచి ఆలపించారు. బాబు మోహన్, ప్రకాష్ శనిగారం సాహిత్యం అందించారు.
previous post