పోలీసులు అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటే సెలవు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. దీక్ష తీసుకుని యూనిఫాం లేకుండా, షూ లేకుండా, గడ్డంతో, విధులకు హాజరుకావడం కుదరదన్నారు. విధుల్లో ఉన్న వారు తప్పని సరిగా యూనిఫాం ధరించి హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ మేరుకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీక్ష తీసుకునే పోలీసులు దీక్ష ఆచరించే నియమాల కారణంగా పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటుంటారు. ఇందుకు సంబంధించి కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీస్ సిబ్బంది అధికారుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
సీపీ మహేష్ భగవత్ పరిశీలించిన దరఖాస్తులను ప్రధాన కార్యాలయం జారీ చేసిన మెమో నెం. 987/ఈ3/2011 ప్రకారం యూనిఫాం, షూ లేకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదని అన్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని సూచించారు మహేష్ భగవత్. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. పోలీస్ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని చెప్పారు. అవసరమైన వారు రెండు నెలలపాటు సెలవుతీసుకుని దీక్ష చేపట్టవచ్చని పేర్కొన్నారు ఈ తరహా అనుమతులకు సంబంధించి వచ్చే విజ్ఞప్తుల్ని సీపీ కార్యాలయానికి పంపవద్దని డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్వోలకు సీపీ మహేష్ భగవత్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.