telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోనీ వికెట్‌ తీయడమే నా కల : అవేశ్‌ ఖాన్‌

ఐపీఎల్ 2021 లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్లతో గెలుపొంది ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న అవేశ్ ఖాన్ అంచనాలకు మించి రాణించాడు. కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్ గైర్హాజరీ నేపథ్యంలో అవకాశం దక్కించుకున్న అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జట్టులో సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఉన్నా.. నయా కెప్టెన్ రిషభ్ పంత్ ఈ యువ పేసర్‌పై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపిన అవేశ్ ఖాన్.. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తూ.. చెన్నై స్టార్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెసిస్, మహేంద్ర సింగ్ ధోనీ వికెట్లను తీసి పంత్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ధోనీ వికెట్‌ తీయడంపై స్పందించిన అవేశ్‌ ఖాన్‌ అది తన డ్రీమ్ అని, ఇన్నాళ్లకు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ‘మూడేళ్ల క్రితం 2018లో మహీ భాయ్‌ వికెట్‌ తీసే అవకాశం వచ్చింది. కానీ కొలిన్ మున్రో క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో నిరాశే ఎదురైంది. మహీ భాయ్‌ వికెట్‌ తీయాలన్న నా కల అలాగే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు.. మూడు సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.”అని ఢిల్లీ క్యాపిటల్స్ మీడియా టీమ్‌తో మాట్లాడుతూ అవేశ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశాడు.

Related posts