telugu navyamedia
సినిమా వార్తలు

“అవెంజర్స్ ఎండ్ గేమ్” విడుదలకు ముందే రికార్డులు

Avengers-4

సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సిరీస్ “అవెంజర్స్” నుంచి వస్తున్న లేటెస్ట్ సిరీస్ “అవెంజర్స్: ఎండ్ గేమ్”. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఉన్న అభిమానులు సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇండియాలో కూడా ఈ సిరీస్ కు భారీగా అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా వ‌స్తున్న చివ‌రి చిత్రం “అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్” ఈ నెల 26న ప్ర‌పంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాకు గాను ఈ నెల 20వ తేదీ నుంచే టిక్కెట్ల‌ను విక్ర‌యించ‌డం ప్రారంభించారు.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన గ‌త 21 చిత్రాల‌ను భార‌త్‌లో సినీ అభిమానులు ఎంత‌గానో ఆద‌రించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి పెద్ద ఎత్తున మ‌న దేశంలో “అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌”ను భారీ స్థాయిలో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ, ముంబై, హైద‌రాబాద్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లోని అన్ని మ‌ల్టీప్లెక్స్‌లు, సాధార‌ణ థియేట‌ర్ల‌లో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ టిక్కెట్లు వ‌చ్చే ఆదివారం వ‌ర‌కు బుక్ అయ్యాయ‌ని బుక్ మై షో ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే టిక్కెట్ల‌ను అమ్మ‌కానికి ఉంచిన తొలి రోజే ఏకంగా త‌మ సైట్‌లో 10 ల‌క్ష‌ల టిక్కెట్లు అమ్ముడుపోయాయ‌ని, సెక‌నుకు 18 టిక్కెట్ల‌ను ప్రేక్ష‌కులు కొనుగోలు చేశార‌ని వారు తెలిపారు. దీంతో ఒకే రోజు ఒక వెబ్‌సైట్‌లో అత్య‌ధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ కొత్త రికార్డు సృష్టించింద‌ని వారు చెప్పారు.

కాగా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీ టిక్కెట్లు ప్ర‌స్తుతం బుక్‌మైషోతోపాటు పేటీఎం, జ‌స్ట్ టిక్కెట్ వంటి ఇత‌ర సైట్ల‌లోనూ అందుబాటులో ఉండ‌గా, తొలి మూడు రోజుల వ‌ర‌కు చాలా వ‌ర‌కు టిక్కెట్లు ఇప్ప‌టికే అమ్ముడ‌య్యాయ‌ని ఆయా వెబ్‌సైట్ల నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఇక ముంబైలో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమా టిక్కెట్ ఒక్కోటి బ్లాకులో రూ.1500 ధ‌ర ప‌లుకుతుంద‌ని తెలిసింది. ముంబైలోని కార్నివాల్ సినిమాస్ ఐమ్యాక్స్‌లో తెల్ల‌వారుజామున 3.20 గంట‌ల షోకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌య్యాయ‌ని, దీన్ని బ‌ట్టే అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమా ప‌ట్ల భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల్లో ఎంత ఆస‌క్తి ఉందో ఇట్టే తెలుసుకోవచ్చ‌ని బుక్‌మైషో సీవోవో ఆశిష్ స‌క్సేనా తెలిపారు.

Related posts