ప్రేమించి మోసం చేశాడని ప్రియుడు పై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో చోటుచేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకోకుండా, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ నాగేంద్ర అనే యువకుడిపై ఆగ్రహంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది.
నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.