అందాల నటి శ్రీదేవి 54వ జయంతి ఈరోజు. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించారు. బోనికపూర్ సోదరి రీనా కుమారుడు పెళ్ళికని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న బాత్ టబ్లో మునిగి కన్ను మూసింది. శ్రీదేవి ఈ లోకాన్ని వీడి ఏడాది పూర్తైంది. ఆమె మరణం ఇప్పటికి కలగానే ఉంది. శ్రీదేవి ఫ్యామిలీ ఇప్పటికి ఆమె జ్ఞాపకాలలోనే బతుకుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి తనయ జాన్వీ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని ఏదో ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఈ రోజు శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుపతి వెళ్ళి ఆమె పేరుపై అభిషేకం చేయించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీకపూర్ తన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. ఐ లవ్యూ’ అని పోస్ట్ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’ లోని ఓ ఫోటో అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు కూడా శ్రీదేవి పేరుతో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు. ‘కాంధన్ కరుణై’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీదేవి, 1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ’16వయతినిలే’ చిత్రంతో మొదటిసారిగా పూర్తిస్థాయి నటిగా మారారు. రెండు తరాల టాప్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు తో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, కమల్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ సరసన ఆమె నటించింది . ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో శ్రీదేవికి తెలుగులోను మంచి ఆదరణ లభించింది. శ్రీదేవి 1994 చిరంజీవితో నటించిన ‘ఎస్పీ పరుశురాం’ తెలుగులో చివరి చిత్రం. 1996లో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని శ్రీదేవి వివాహం చేసుకున్నారు. అప్పటికే బోని కపూర్ కి పెళ్ళై పిల్లలు ఉన్నారు. పెళ్ళైన తరువాత చిత్రాలలో నటించడం తగ్గించిన శ్రీదేవి, గతకొన్నేళ్ళుగా కధానాయిక ప్రాధాన్యం చిత్రాలలో నటించారు.