మార్చి 10న దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ షెడ్యూల్ ప్రకటించిన వేళలు దుర్ముహూర్తంలో ఉన్నాయని, దీని కారణంగా అనేక విపరీతాలు జరిగే అవకాశం ఉందంటున్నారు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి. ఆయన ప్రముఖ జ్యోతిష్యులుగా పేరుపొందారు. శ్రీకాళహస్తి శైవక్షేత్రం ఆస్థాన పండితులుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఘడియలపై తన విశ్లేషణను మీడియా ముందుంచారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన సమయంలో రాహుకాలం, దుర్ముహూర్తం కలిసి ఉన్నాయని అన్నారు. దానికితోడు ఆ ఘడియల్లో గ్రహగతులు బాగాలేకపోవడంతో ఎన్నికల చరిత్రలో ఇంతవరకు జరగని ఘటనలు చోటుచేసుకుంటాయని, హింస విశ్వరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయని వివరించారు.
ఎన్నికల ప్రకటన సింహ లగ్నం… చతుర్థంలో గురువు, పంచమంలో శని-కేతువు, షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవి, తొమ్మిదింట చంద్రకుజులు, ఏకాదశుల్లో రాహువు కొలువుదీరిన సమయంలో చేశారని, ఇది ఏమాత్రం మంచి సమయం కాదని ములుగు సిద్ధాంతి వివరించారు. ఇలాంటి దుర్ముహూర్తం కారణంగా ఎన్నికైన లోక్ సభ పూర్తికాలం కొనసాగకపోవచ్చని అన్నారు.