అసోం రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిన్సుకియా జిల్లాలో గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ బావిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బావిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం మొదలైన వెంటనే అసోం సీఎం సర్బానంద సోనోవాల్ కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించారు.
అసోం రాజధాని గౌహతికి 500 కిలోమీటర్ల దూరంలోని బాఘ్జాన్ వద్దనున్న ఈ చమురు బావి నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. పరిసర ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గత 14 రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నప్పటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సిద్ధంగా ఉన్నారు. సింగపూర్కు చెందిన వెల్ కిల్లింగ్ నిపుణులు లీకేజీని అరికట్టేందుకు సోమవారం ఇక్కడికి వచ్చారు. వీరు ప్రయత్నాలు మొదలెట్టిన మరుసటి రోజే మంటలు చెలరేగాయి.