అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా జిల్లా కాస్గంజ్లో అఖండ ఆర్యవర్త నిర్మాణ సంఘ్ అనే హిందూ సంస్థ ఒవైసీపై కేసు పెట్టింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుపై ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ఆరోపించింది.
దేశంలో మతసామరస్యం దెబ్బతినేలా ఒవైసీ, సాంబాల్ ఎంపీ సాఖి ఉర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు మానవతకే కాకుండా, దేశ ఐక్యతకు కూడా విఘాతం కలిగిస్తాయని సంఘ్ అధ్యక్షుడు భూపేశ్ శర్మ అన్నారు. వీరిద్దరిపై ఎన్ఐఏ చట్టం కింద అభియోగాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 11న పవన్ కుమార్ అనే అడ్వొకేట్ కూడా ఒవైసీపై ఇదే తరహా ఫిర్యాదు చేశారు.