telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోనా పాజిటివ్

Aishwarya

యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ మెసేజ్‌ను పొందుపరిచారు. ‘‘ఇటీవల నాకు చేసిన టెస్టుల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నిపుణులతో కూడిన వైద్య బృందం సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను’’ అని ఐశ్వర్య తన పోస్ట్‌లో వెల్లడించారు. గడిచిన కొద్ది రోజుల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఐశ్వర్య సూచించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని.. మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానని ఆమె వెల్లడించారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. కన్నడ సినీ పరిశ్రమలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అర్జున్ మేనల్లుడు, దివంగత నటుడు చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యకు పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉంటే, అర్జున్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఇప్పటికే వెండితెరకు పరిచయమైంది. విశాల్ హీరోగా తమిళంలో వచ్చిన ‘పట్టాతు యానై’ సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టింది. ఈ సినిమా తెలుగులో ‘ధీరుడు’ పేరిట అనువాదమైంది. ఆ తరవాత ‘ప్రేమ బరహ’ చిత్రంతో కన్నడ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించినా ఐశ్వర్య అర్జున్‌కు బ్రేక్ రాలేదు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని చూస్తోంది.

Related posts