ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఆర్టీసీలో కొత్త పోస్టుల నియయామకం జరగనుంది. నియామకాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు, ఐచ్ఛిక బదిలీలకు వీలు కల్పిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టీసీ విజయనగరం జోన్లో త్వరలో 700 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నట్టు ఆ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పి.కృష్ణమోహన్ వెల్లడించారు.
కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. విజయనగరం జోన్లో 400 వరకు వివిధ స్థాయిల్లో ఖాళీలున్నాయి. కొన్నింటిని కండక్టర్లకు ఏడీసీలుగా పదోన్నతులిచ్చి భర్తీ చేస్తాం. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి యాజమాన్యం అనుమతి కోరమని తెలిపారు. ప్రభుత్వం అర్టీసీ ఉద్యోగుల అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతినిచ్చింది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానిక్ల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసే వారు తాము కోరుకున్న చోటుకు బదిలీకి అవకాశం కల్పించిందని ఈడీ పేర్కొన్నారు.