గత ప్రభుత్వ హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరినీ తిరిగి అదే పోస్టుల్లో లేదా వేరే బాధ్యతల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అప్పటి మంత్రుల కార్యాలయాల్లో ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ప్రైవేట్ కార్యదర్శులు, అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా పలువురు పనిచేశారు. తాజాగా ప్రభుత్వం మారి కొత్త మంత్రులు రావడంతో వీరంతా తిరిగి అవే పోస్టుల్లో కొనసాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
అప్పటి మంత్రుల వద్ద పనిచేసిన వారెవరినీ తీసుకోవద్దని, ఈ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ తన ముఖ్య సహాదారు అజేయ కల్లంకు సూచించడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టే. సిబ్బంది నియామకాల్లో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.