ఏపీలో మూడురాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానమన్న బొత్స.. సమయం చూసి మూడు రాజధానులు బిల్లు తీసుకొస్తామని కుండబద్దలు కొట్టారు. మొదటి నుండి అదే చెప్తున్నామని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఇప్పటికీ పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ సమస్యల పై ఎమ్మెల్సీలతో చర్చించాం. అన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని సంఘాల వారికి నాలుగో తేదీన రమ్మని చెప్పాం.
ఎవరు ఎప్పుడు కోరితే అప్పుడు టైం ఇస్తాం. మున్సిపల్ స్కూల్సులో టీచర్ల సంఖ్య పెంచమని అడిగారు. పీఎఫ్ వంటి సమస్యలు అడిగారు. అన్నీ పరిష్కరిస్తామన్నారు మంత్రి బొత్స.
అమరావతి విషయంలో హైకోర్టు కొద్దిరోజుల క్రితం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది.
హైకోర్టు తీర్పుపై అదేరోజు స్పందించిన బొత్స సత్యనారాయణ పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు.
చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్వేయమని బొత్స పేర్కొన్నారు.
రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి