తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.
మరోవైపు, ఏపీలో గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం కూడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేసింది. ఏపీలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది.
ఈ నేపథ్యంలోనే తీరం వెంబడి గంటకు 50 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు. ఒడిశా ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ప్రభావం ఉంటందని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది.
దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
అటు తెలంగాణలోనూ పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండటంతో, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. జిల్లాల వారీగా కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అన్ని శాఖ అధికారులను అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ముంపు ప్రాంతాలకు సహాయక బృందాలను తరలించాలని నిర్ణయించింది.