ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొందూరు మండలం లైదాం గ్రామంలో అధికారులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అంశాన్ని అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఘాటుగా స్పందించారు. మీరున్నది ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా అంటూ మండిపడ్డారు.ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకునైనా భూములను ప్రభుత్వ పరం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించవద్దని వెంటనే ఖాళీ చేయించాలని అన్నారు.