telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఏపీలో పెరిగిన బడి గంటలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడిగించారు. కరోనా కారణంగా వాయిదాపడిన 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో భాగంగానే పాఠశాలల సమయాన్ని పొడిగించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచి ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని 10 గంటలకు పెంచారు. పెంచిన 3 గంటల సమయాన్ని ఐచ్ఛిక సహ పాఠ్యాంశాలు, విరామం కోసం కేటాయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 188 పని దినాలు ఉండనున్నాయి.

 

ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్‌ బడులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేలా పాఠ్య ప్రణాళికను రూపొందించారు. గతంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పని చేసేవి. గతేడాది కరోనా నేపథ్యంలో ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చారు. ఇప్పుడు సహ పాఠ్య కార్యక్రమాల కోసం సమయం పెంచుతూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది.

6 రకాల పాఠశాలలను ప్రారంభించిన అధికారులు వాటి సమయాలు ఇలా మార్పులు చేశారు. ఉన్నత పాఠశాలలు మొత్తం 10 గంటల వరకు పని చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్ బడులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేయనున్నాయి. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు(పీపీ-1,2) ఉదయం 9.05 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పని చేయనున్నాయి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు పండగ సెలవులు ఇలా ఉన్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. అలాగే దీపావళికి నవంబర్ 4న, క్రిస్మస్(మిషనరీ బడులకు) డిసెంబర్ 23-30 వరకు సెలవులు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు, ఉగాది ఏప్రిల్ 2న సెలవు ఇస్తారు.

కాగా, 6-10 తరగతుల విద్యార్ధులకు సమ్మెటివ్-1 పరీక్షలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు జరగనుండగా.. 6-9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి 29 వరకు జరుగుతాయి. ఇక సెప్టెంబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. అటు ఈ ఏడాది విద్యార్ధులకు
‘నీటి గంట’ అములు చేయనుండగా.. ప్రతీ నెల మొదటి, మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ను నిర్వహిస్తారు. ఇక ప్రతీ రోజూ ఒక పీరియడ్ ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమానికి కేటాయించనుండగా.. 9-10 తరగతుల విద్యార్ధులకు ప్రతీ శుక్రవారం 8వ పీరియడ్‌లో ‘కెరీర్ గైడెన్స్’పై అవగాహన కల్పిస్తారు.

Related posts