telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఏపీ పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తాజాగా పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా టెక్నికల్‌ ఎడ్యకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాం. విద్యార్థులకి స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కాగా, రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

నోటిఫికేషన్‌ వివరాలు.. అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్టోబర్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం కల్పించాం. అక్టోబర్ 9న ఆప్షన్స్‌ మార్చుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 11న సీట్లు కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 12 నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి. 18వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకి తరగతులు ప్రారంభమౌతాయి.

Related posts