తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు “రచ్చబండ” కార్యక్రమాన్ని చేపడతానని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుతున్న సేవలను తాను నేరుగా పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎం సూచించారు.
రైతులు, విద్య, వైద్యం రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జగన్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆయన తెలిపారు. “స్పందన” పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో తెలపాలనీ, ఇందుకు సంబంధించి రశీదును ఇవ్వాలని తెలిపారు.