సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఏపీ సర్కారు జారీ చేసిన 18 జీవోలను రద్దు చేయాలని ఈసీ సిఫార్సు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వాటిని రద్దు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ జీవోలను జారీ చేయడంతో రద్దు చేయబడ్డాయి. పోలింగ్ పూర్తయిన తరువాత చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులకు ఈసీ నుంచి సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత, ప్రకృతి విపత్తులు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే సీఎం సమీక్షలను నిర్వహించుకోవచ్చు. అది కూడా ఈసీ అనుమతి తీసుకునే జరపాలి. అయితే, 11న పోలింగ్ ముగిసిన తరువాత, సీఎం తొలుత పోలవరంపై, ఆపై సీఆర్డీయేపై సమీక్షలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో తాను జరపాలని తలపెట్టిన హోమ్ శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక రద్దు చేసిన జీవోల్లో అత్యధికం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులవేనని తెలుస్తోంది.