ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ ముస్తాబవుతువుతుంది. ప్రమాణస్వీకార ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ నెల 23న గవర్నర్ బిశ్వభూషణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, అదే రోజు సాయంత్రం విజయవాడ చేరుకుంటారని తెలిపారు. ఎయిర్ పోర్టులో గవర్నర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారని వివరించారు.
తొలిసారిగా గవర్నర్ రాష్ట్రానికి వస్తున్నందున సైనిక వందనం ఉంటుందని తెలిపారు. ఆపై ఆయన బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటారని సీఎస్ పేర్కొన్నారు. 23వ తేదీ రాత్రికి ఆయన రాజ్ భవన్ లో బస చేస్తారని, ఆ మరుసటి రోజున అధికారికంగా గవర్నర్ పదవీ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని తెలిపారు.ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు.