ఏపీ రాజ్ భవన్ లో ‘ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలోనిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రులు, టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఏపీలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే ‘ఎట్ హోమ్’ నిర్వహించగా, తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేవారు.
ఇటీవలే ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమించడంతో ఈసారి ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఏపీలోనే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కన్నబాబు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఉదయభాను, వసంతకృష్ణప్రసాద్, టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కనకమేడల, అశోక్బాబు, డొక్కా, బీజేపీ నేతలు కన్నా, దిలీప్, అడపా నాగేంద్ర, గాయత్రి, సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్ తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరైయ్యారు.