ఏపీలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కేసులు పెడతామని, పాస్ పోర్టులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా తీవ్రత అనుసరించి ప్రతిరోజూ ఆంక్షలు పెరిగే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు.
అత్యవసర సమయాల్లో కూడా కారులో ఇద్దరినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 298 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వివరించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడమే కాకుండా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని తెలిపారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు.