*వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
*ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నాం..
*విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతుకు తోడుగా ప్రభుత్వం..
గుంటూరు చుట్టుగుంట సెంటర్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా లబ్దిదారులకు ట్రాక్టర్లను, హర్వెస్టర్లనుఏపీ సీఎం జగన్ అందించారు. ఈ పథకం ద్వారా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి సీఎం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమచేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నామన్నారు. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతుకు తోడుగా ప్రభుత్వం ఉంటోందని, అందుకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
ట్రాక్టర్లతో పాటు రైతులకు ఉపయోగపడే వనిముట్లను అందుబాటులో ఉంచామని అన్నారు. రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు.
3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందన్నారు
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అరకొరగానే రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ట్రాక్టర్స్ కొనుగోలులో స్కామ్ లు జరిగాయని ఆయన విమర్శించారు.