శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో మరణించినవారిని జేసీబీతో తరలించడం పట్ల సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించిందన్నారు.
పలాస మునిసిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా అప్పటికే నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. విషయం తెలిసిన శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు తొడిగించి మృతదేహాన్ని జేసీబీతో శ్మశానానికి తరలించారు. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన కలెక్టర్ నివాస్ ఇందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు.