దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార ఘటనపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో కొత్త చట్టం తీసుకురావాలని జగన్ ప్రకటించడంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ప్రముఖ సినీ నటి విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన జగన్ కు తన అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. మహిళల భద్రత కోసం ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నామని, ఆడవారిపై నెగెటివ్ పోస్టింగ్స్ చేసే వారికి శిక్ష పడేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని, సెక్షన్ ‘354 ఈ’ని ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు.