ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్, ఓటర్ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
టీడీపీ సేవామిత్ర యాప్లో ఏపీ ప్రజల ఓటార్ ఐడీ కార్డు వివరాలు, ఆధార్ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్న భారీ అసమానతలు అదేవిధంగా ఎన్నికల దుష్ప్రవర్తనకు ప్రభుత్వం పాల్పడినట్లుగా వినతి పత్రంలో పేర్కొన్నారు.