బ్యానర్స్ : కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : అనుష్క, మాధవన్, అంజలి, షాలినిపాండే, సుబ్బరాజ్, మైకేల్ మ్యాడ్సేన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు
దర్శకత్వం : హేమంత్ మధుకర్
సంగీతం : గోపీ సుందర్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ : గిరీష్.జి
సినిమాటోగ్రఫీ : షానియల్ డియో
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
అనుష్క మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “నిశ్శబ్దం”. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఏప్రిల్ కు వాయిదా పడింది. తరువాత కరోనా వైరస్ వల్ల ఇంకా ఆలస్యమైంది. ఇక లాక్డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది ఈ చిత్రం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “నిశ్శబ్దం” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎలా థ్రిల్ చేసిందో తెలుసుకుందాం.
కథ :
సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. సాక్షి మంచి పెయింటర్ కూడా. ఇక ఆంటోనీ (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్, మిలియనీర్. వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఎంగేజ్మెంట్ జరిగిన తరవాత వీరిద్దరూ కలిసి సరదాగా ట్రిప్కు వెళ్తారు. ఈ ట్రిప్లో భాగంగా భూతాల కొంపగా పేరొందిన ఒక పాత ఇంటికి వీరిద్దరూ వెళ్తారు. అయితే ఆ ఇంట్లోనే 1972లో భార్యాభర్తలు హత్యకు గురవుతారు. అప్పటి నుంచి ఆ బంగ్లా అంటే అందరికీ హడల్. కానీ సాక్షి ఆ విల్లా ఓనర్ జోసెఫ్ వేసిన ఓ పెయింటింగ్ వేయాలని అనుకోవడంతో సాక్షి, ఆంటోనీ అక్కడికి వెళ్తారు. వెళ్లిన కొంతసేపటికి ఆ ఇంట్లో ఆంటోనీ హత్యకు గురవుతాడు. సాక్షి మాత్రం గాయాలతో బయటపడుతుంది. ఆ తరువాత సాక్షి పోలిసుల దగ్గరకు వెళ్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? ఆంటోనీని ఎవరు చంపారు? మూగ అమ్మాయి అయిన సాక్షి పోలీసులకు ఆ విషయాన్ని ఎలా చెప్పింది ? చివరికి సస్పెన్స్ ఎలా వీడింది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
నటీనటుల విషయానికి వస్తే అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా బాగానే నటించింది. సైన్ లాంగ్వేజ్తోనే సాగుతుంది. ఇలాంటి విభిన్నమైన పాత్రను చేయడానికి అనుష్క ధైర్యం చేయడం అభినందనీయం. కానీ అనుష్క పాత్రలో బలమైన ఎమోషన్స్ను బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆమె పడ్డ కష్టానికి పాత్రను మలిచిన తీరు చూస్తే తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సేన్ కూడా చాలా మంచి పాత్రలో నటించాడు. డిటెక్టివ్ పాత్రలో అంజలి న్యాయం చేసింది. షాలిని పాండే, సుబ్బరాజ్ పాత్రలకు సెకండాఫ్లోనే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మొత్తానికి వారికి మంచి పాత్రలు దక్కాయి.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు హేమంత్ మధుకర్ కథను చాలా క్రియేటివ్గా రాసుకున్నారు. దర్శకుడు హేమంత్ మధుకర్, స్క్రీన్ప్లే రైటర్ కోన వెంకట్ సినిమాను అలా ముందుకు నడపడంతో కాస్త ఓకే అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఆసక్తిని కలిగిస్తుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం సినిమా ఇరవై నిమిషాల ముందే ట్విస్ట్ రివీల్ చేసేయడంతో దీంతో ప్రేక్షకులకు కిక్కు మిస్సవుతుంది. ఇక ఆ తరవాత జరిగే కథ అంతా ఊహాజనితమే. థ్రిల్లర్ మూవీస్ క్లైమాక్స్ వరకు సస్పెన్స్ను మెయింటైన్ చేస్తూ చివరి వరకు ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వాలి. టెక్నీకల్ గా సినిమా అద్భుతంగా ఉంది. విజువల్స్ అదిరిపోయాయి. షనీల్ డియో కెమెరా పనితనం గొప్పగా ఉంది. అలాగే, గిరీష్ గోపాలక్రిష్ణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్. గోపీ సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘నిన్నే నిన్నే’ సాంగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.5/5