2014లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. కథానాయకుడు నిఖిల్ కెరీర్లో చక్కటి కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. దర్శకుడు చందు మొండేటికి శుభారంభాన్ని అందించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘కార్తికేయ-2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో కథానాయికగా అనుపమపరమేశ్వరన్ ఖరారైనట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళ పరిశ్రమల్లో అనుపమ పరమేశ్వరన్కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని చెబుతున్నారు. జనవరి ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కుంభమేళా నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథాంశమిదని అంటున్నారు. ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రం ద్వారా అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
previous post
మరోసారి హిందూమతం మీద కామెంట్ చేసిన కమలహాసన్