తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల అవకతవకలపై విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఇప్పటి వరకు 23మంది విద్యార్థులు బలవంమరనాలకు పాల్పడ్డారని, ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్త ఆందోళనల నేపధ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటే, ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన ఓ విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సాక్షాత్తు కేటీఆర్ ఇలాకాలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశం అవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చింది.
తెలంగాణలో ఇంటర్మిడియట్ ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి విద్యార్థులు ఫెయిల్ అయ్యామని వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకపక్క ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పినా విద్యార్థులు మాత్రం ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. ఇప్పటికి తెలంగాణలో విద్యార్ధిని, విద్యార్థులు సూమారు 23 మంది విద్యార్థులు ప్రాణాలను వదిలారు . తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటమండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన కామిండ్ల లావణ్య అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.