ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి ఉత్తర రాష్ట్రాలు. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడటంతో ఈ పరిస్థితి మరింతగా తీవ్రరూపం దాల్చనుంది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది. బుధవారంలోగా తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వరసగా నాలుగు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు. వాయగుండం మంగళవారం సాయంత్రానికి బాలసోర్కు ఆగ్నేయంగా 130 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శుక్రవారం మధ్యాహ్నం బాలసోర్కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల దాకా తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 110, విశాఖపట్నం జిల్లా పాడేరులో 98 మి.మీ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 60 మి.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి విజయవాడలో 50 మి.మీ వరకు వర్షం కురవడంతో నగరంలో కాల్వలు, రహదారులు ఏకమయ్యాయి. గోదావరి వరదల కారణంగా నిర్వాసితులైన 23,244 కుటుంబాలకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.647 లక్షల నష్టం వాటిల్లింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు.
మాటల్లో తేనె.. చేతల్లో కత్తెర: యనమల