వరద పరిస్థితిపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. వరదలకు భయపడి చంద్రబాబు హైదరాబాద్కు పారిపోయారని విమర్శించారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని మంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పేర్కొన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతోనే నీటి విడుదల జరిగిందన్నారు. పదేళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరద వచ్చిందని గుర్తుచేశారు. గుంటూరులో 6వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని.. పూర్తి స్థాయి వరద నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.