ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు https://sche.ap.gov.in/EAPCET, https://sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీలో ఈ పరీక్షలకు మొత్తం 1.76 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీలలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ తొలగించినట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. గతేడాది వరకు ఈ ఎంట్రన్స్ పరీక్షలలో విద్యార్థులకు వారి ఇంటర్ మార్కులకు గానూ 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను నిర్వహించని కారణంగా వెయిటేజ్ తొలిగిస్తున్నట్లు ఇటీవల ఇంటర్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే.