బిగ్ బాస్ సీజన్-3 విజయవంతంగా ఆరువారాలు పూర్తి చేసుకుంది. నాగ్ తన బర్త్డే వేడుకల కోసం అని స్పెయిన్కి వెళ్లడంతో గడచిన శని, ఆది వారాల ఎపిసోడ్స్కి రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. వినాయక చవితి సందర్భంగా గతవారం ఎలిమినేషన్ కూడా క్యాన్సిల్ అయింది. సోమవారం ప్రసారమైన 44వ ఎపిసోడ్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ముందుగా గణపతి సాంగ్తో అందరిని నిద్ర లేపిన బిగ్ బాస్.. వారికి పూలు, పండ్లు, స్వీట్స్, తోరణాలు, అరటి ఆకులు పంపించారు. ఇంటిని అందంగా అలకరించుకోవాలని సూచించారు. ఇంటి సభ్యులు అందరు సంప్రదాయ పద్దతిలో అందంగా తయారై వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. అలానే ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరికలు కూడా కోరుకున్నారు. ముఖ్యంగా హిమజ నవంబర్ 2 తన బర్త్డే కాబట్టి ఆ రోజు ఇంటి సభ్యులతో తన బర్త్డేని జరుపుకోవాలని భావించింది. అప్పటి వరకు ఇంట్లోనే తాను ఉండాలని, దాని కోసం శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొంది. ఇక కొద్ది సేపటి తర్వాత రవి,అలీని కన్షెషన్ రూంలోకి పిలిచారు బిగ్ బాస్. కన్ఫెషన్ రూంలో ఉన్న టీవీలో ఒక లేడీ వారి కంటపడింది. కాని ఆ లేడీ ఎవరనేది వీరు సరిగ్గా గుర్తించలేకపోయారు. అయితే తాను మిస్టరీ ఫ్రెండ్ అని చెబుతూ.. ఇద్దరిని నామినేషన్ చేయాలని పేర్కొంది. దీంతో అలీ.. రాహుల్ని, రవి.. మహేష్ను నామినేట్ చేశారు.
ఆ తరువాత కన్షెషన్ రూంలోకి వచ్చిన వితిక, పునర్నవిలని కూడా మిస్టరీ ఫ్రెండ్ నామినేట్ చేయమనగా వారు .. అలీ, రవిలను నామినేట్ చేశారు. అనంతరం వచ్చిన శివజ్యోతి, హిమజ జంట.. మహేష్, రాహుల్లను నామినేట్ చేశారు. ఆ తరువాత రాహుల్, మహేష్ జంటగా వచ్చి శ్రీముఖి, అలీని నామినేట్ చేస్తున్నట్టు మిస్టరీ ఫ్రెండ్కి చెప్పారు. అనంతరం కన్ఫెషన్ రూంలోకి వచ్చిన బాబా భాస్కర్, శ్రీముఖిలని వేరే గొంతుతో పలకరించింది మిస్టరీ ఫ్రెండ్. నామినేట్ చేయమని చెప్పడంతో అలీని బాబా భాస్కర్, రాహుల్ని శ్రీముఖి నామినేట్ చేశారు. చివరిగా కెప్టెన్ వరుణ్ సందేశ్ సింగిల్గానే కన్ఫెషన్ రూంలోకి వెళ్లి .. రవి, అలీలని నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ పూర్తైన కొద్ది సేపటికి ప్రముఖ టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి సైలెంట్గా ఇంట్లోకి అడుగుపెట్టింది. కన్ఫెషన్ రూంలో మిస్టరీ ఫ్రెండ్గా మాట్లాడింది తానే అని చెబుతూ అందరిని పలకరించింది. అయితే బిగ్ బాస్… శిల్పాని కూడా నామినేట్ చేయమని కోరడంతో ఆమె సరైన కారణాలు లేవు కాని తాను శ్రీముఖి, అలీలని నామినేట్ చేస్తున్నట్టు పేర్కొంది. మొత్తానికి ఏడో వారంకి గాను రాహుల్, అలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. తరువాత పండుగ సందర్భంగా ఇంటి సభ్యులు పిండి వంటలు వండుకోమని చెప్పడంతో వారు పూరీ హల్వా చేసుకొని పండుగని ఫుల్ ఎంజాయ్ చేశారు. మొత్తానికి సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన శిల్పా చక్రవర్తి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.