మహీంద్రా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ పదవి నుంచి త్వరలో తప్పుకోబోతున్నారు. ఈ మేరకు డిసెంబర్ 20, శుక్రవారం నాడు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1, 2020 నుంచి ఆనంద్ మహీంద్రా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆనంద్ సైతం ధ్రువీకరించారు. కంపెనీని సమర్థవంతంగా నిర్వహించడానికి మా గ్రూప్ కట్టుబడి ఉంది. దాన్ని ప్రతిబింబించే విధంగా నాయకత్వ మార్పులు జరిగాయని చెప్పడానికి ఆనందంగా ఉంది. సంవత్సర కాలం పాటు ఈ ప్రక్రియకోసం శ్రద్ధగా మరియు కఠినమైన కసరత్తు నిర్వహించినందుకు బోర్డు మరియు నామినేషన్ కమిటీకి నా కృతజ్ఞతలని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన పవన్ కుమార్ గోయెంకా ఎండీ మరియు సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఏప్రిల్ 1, 2021 వరకు సంవత్సరం పాటు పవన్ గొయెంకా ఈ పదవిలో కొనసాగనున్నారు. గొయెంకా పదవీ విరమణ తర్వాత అనిశ్ సిన్హా సీఈవో, ఎండీ బాధ్యతలు చేపడతారని కంపెనీ పేర్కొంది.