పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత నిన్న రాత్రి అస్వస్తతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కిందపడిపోయారు. దీంతో, ప్రణయ్ తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. అమృత తండ్రి మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిన్న మిర్యాలగూడలో జరిగాయి.
తండ్రిని చివరి చూపు చూసుకుందామనుకున్న ఆమెకు నిరాశ మిగిలింది. మారుతీరావును చూడకుండా కుటుంబసభ్యులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో, ఆమె శ్మశానవాటిక నుంచి వెనుదిరిగింది.బాబాయ్ శ్రవణ్, ఆయన కూతుర్లు తనను అడ్డుకున్నారని ఆ తర్వాత అమృత ఆరోపించింది. తన తండ్రికి, బాబాయ్ కి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని చెప్పింది. మరోవైపు, ఆస్తి కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని శ్రవణ్ విమర్శించారు.