హైదరాబాద్ సహా దేశమంతటా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దేశంలో తిష్ఠవేసిన అక్రమ వలసదారులందరినీ 2024 లోగా తరిమికొడతామని తేల్చిచెప్పారు. చొరబాటుదారులను పంపేందుకు చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుందని.. ఐక్యరాజ్యసమితి ఒప్పందం ప్రకారం దాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్ఆర్సీ విషయంలో ఇప్పుడున్న ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరిశీలించి వాటిని సరిచేసి కొత్త ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. గురువారం హరియాణలోని గుర్గావ్ సభలో, యూపీలోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ట్రైబ్యునళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. అసలు ఎన్ఆర్సీని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
బిహార్లో భీజేపీ-జేడీయూ పొత్తు కొనసాగుతుందని అమిత్షా స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. పొత్తు ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య కిందిస్థాయిలో కొంతమేర విభేదాలు ఉండటం సర్వసాధారణమన్నారు. బిహార్ ఎన్నికల్లో తమ పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ వస్తుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో మోడీ అస్త్రం ఆర్టికల్ 370 రద్దు అయితే అమిత్ షా అస్త్రం ఎన్ఆర్సీ. చెరో అస్త్రంతో మొత్తానికి ప్రచారం తీవ్రతరం చేస్తున్నారు.