రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 77 ఏళ్ల అమితాబ్ ఈ అవార్డ్ అందుకొన్నారు. ఈ కార్యక్రమానికి జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి గత వారం జరిగిన చలనచిత్ర జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అమితాబ్ పాల్గొనాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన హాజరు కాలేక పోయారు. అవార్డుల విజేతలకు ఆదివారం రాష్ట్రపతిభవన్లో తేనీటి విందు ఏర్పాటు చేయడంతో ఈ సందర్భంగా అమితాబ్కు ఫాల్కే అవార్డ్ అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ “ఫాల్కే అవార్డ్ నాకు ప్రకటించారనే వార్త తెలియగానే నాకో సందేహం కలిగింది. ‘ఇక నటన చాలించి ఇంటిపట్టున కూర్చుని రెస్ట్ తీసుకో ’ అనే సంకేతాన్ని ఈ అవార్డ్ ఇస్తోందా? అనిపించింది. అయితే ఇంకా నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అందుకే ఈ విషయమై నాకు వివరణ కావాలి” అని అవార్డ్ స్వీకరించిన అనంతరం ట్వీట్ చేశారు అమితాబ్. ‘తల్లితండ్రుల ఆశీస్సులు, భగవంతుని దీవెనలు, దర్శకనిర్మాతల ప్రోత్సాహం… అన్నింటికంటే మించి ప్రేక్షకుల అండదండల వల్లే నేనీ స్థాయికి చేరుకోగలిగాను. ఫాల్కే అవార్డ్ ప్రవేశపెట్టి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి. అలాగే నేను పరిశ్రమలోకి ప్రవేశించి కూడా యాభై ఏళ్లు అయింది. అందుకే ఇటువంటి నేపథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఫీలవుతున్నాను” అని అమితాబ్ పేర్కొన్నారు.